మెక్సికోలో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
మెక్సికోలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అవసరం లేకుండా బయటికి రావొద్దని సూచనలు.
మెక్సికోలో జరిగిన తాజా పరిణామాలు అక్కడి పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చాయి. ఆర్మీ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నెమెసియో ఓసెగేరా సెర్వాంటెస్ (ఎల్ మెంచోగా ప్రసిద్ధి) హతమయ్యాడనే వార్తల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. అతడి అనుచరులు రహదారులపై వాహనాలకు నిప్పుపెట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రత్యేకంగా జలిస్కో రాష్ట్రంలోని ప్యూర్టో వల్లర్టా, గ్వాదలహారా, తపల్పా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు సమాచారం. స్థానిక భద్రతా బలగాలు అప్రమత్తమయ్యి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మెక్సికోలో నివసిస్తున్న భారతీయులకు అక్కడి Embassy of India, Mexico City కీలక అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి అధికారిక సమాచారం వచ్చే వరకు అవసరం లేకుండా బయటికి వెళ్లకూడదని, ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, నిరసనలు జరుగుతున్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. స్థానిక పరిస్థితులను గమనిస్తూ భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది.
ఎవరైనా అత్యవసర సహాయం అవసరమైతే +52 55 4847 7539 నంబర్ ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0